Wednesday, January 31, 2007

హూలై

ఒకతను కంపెనీ పనిమీద ఉద్యోగంలో చేరడానికి భారత్ నుండి అమెరికాకు విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతను వెళ్ళాల్సిన చోటు San jose కాలిఫోర్నియా.

విమానం కాలిఫోర్నియా లో దిగేముందు అతని పక్కనున్న అమెరికన్ అడిగాడు.

"ఎక్కడ ఉద్యోగం చెయ్య బోతున్నారు?" అని..ఇంగ్లీషులో లెండి.
"శాన్ జోస్" అన్నాడు మన వాడు.
ఆ అమెరికన్ తడబడి "No. That is not spelled as san Jose. It should be spelled as san hoesay. Here "J" is silent".
"Oh I see I got it" అన్నాడు మన వాడు.


కొంత సేపు అయిన తరువాత మళ్ళీ అమెరికన్ అడిగాడు.

"When are you going back to India".
"హూలై" అన్నాడు.

మరి అక్కడ "J" సైలెంట్. మన వాడు తిరిగి వెళ్ళాల్సింది జూలై లో.

Tuesday, January 30, 2007

కాకి పిల్ల కాకికి ముద్దు... మా మంచి బ్లాగు నా బ్లాగే.

చాలా మందిని కుట్టిన చీమే నన్నూ కుట్టింది. మన భారత బ్లాగుల వాళ్ళు (www.indibloggies.org) ఉత్తమ బ్లాగుల పోటీ పెట్టారు. ఇందులో కొన్నింటిని తెనె గూడు వారు ప్రాయోజితం చేస్తున్నారు. అందులో కాలు పెడదామని అనుకున్నా. బ్లాగును కూడా తయారు చేశాను చాలా సమయం వెచ్చించి. అంతా అయిన తరువాత ఆలోచించా ఇంతకు మనకు అందులో పాల్గొనే సత్తా వుందా అని. బ్లాగు ప్రపంచం లో అడుగు పెట్టి 4 నెలలు అయింది. మా సుహాస్ వయసు కన్నా ఒక నెల ఎక్కువ. వాడు ఇప్పుడే దొర్లుతున్నాడు. అలాగే నేను కూడా దొర్లుతున్నా ఈ బ్లాగు లోకంలో. నాకన్నా ఎక్కువగా పరుగులు పెడుతున్న పీ.టి.ఉషలు బెన్ జాన్సన్ లు వుండగా నన్ను నేను నామినేట్ చేసుకోలేనని భావించి, చాలా విభాగాల్లో ఇతరులను బల పరచేసి వాళ్ళ బ్లాగులు పెట్టేశా.

నాకేమి మిగిలిందబ్బా అని బుర్ర గోక్కుంటే రెండు క్యాండిల్స్ బల్బు "Design Department" అని గాఠ్ఠిగా అరిచి టపీ మని ఆరిపోయింది. అవును ఇందులో నేనెందుకు పాల్గొనకూడదు అని ఓ నామినేషన్ పారేశా. మీరు కూడ యధాశక్తిగా నన్ను బలపరిచి గెలిపిస్తే కొత్త పెళ్ళికూతురిలా....క్షమించాలి ముఖ్యమంత్రి నియోజక వర్గంలాగా తళతళ లాడుతూ కళ గా ఉంటానని నేను ఈ బ్లాగుముఖంగా విన్నవించుకుంటున్నాను.

మీరు అలా నన్ను బల పరచలేక పోతే ఏ ప్రాతిపదికన అవార్డు ఇస్తారో కూడా మీరే చెప్పాలి. ఒక వేళ పొరపాటున నాకు అవార్డ్ వచ్చేస్తే, అవార్డ్ తీసుకునే రోజున ఈ అవార్డు కు నా బ్లాగుకు సముచితం కాదు అని, తీసుకోవడానికి మనస్సాక్షి అంగీకరించక పోతే దానిని ఒక కాల నాళిక లో పెట్టి వచ్చే సంవత్సరం బ్లాగుల పండగప్పుడు తీసుకుంటానని మీకు ఈ బ్లాగు ముఖంగా మౌసెనయంగా (సవినయంగా అని అర్థం చేసుకోగలరు) మనవి చేసుకుంటున్నాను.

మీ అందరికి ఇంకో హెచ్చరిక :-) మీరు నన్ను కాదని ఇంకొక బ్లాగును బల పరిస్తే నాకు ముందుగా తెలియ చేయండి. ఆ బ్లాగును ఎలాగైనా సం హరించడానికి ఓ పది ట్రోజాన్ హార్సులు (టాటా సుమోలు), ఓ పది స్కంక్పాక్స్ వైరసులు (శ్కార్పియోలు) పంపి పోటీ లేకుండ చెయ్యగల సాహసం కలవడననిన్ని మీకు దుర్వినయంగా హెచ్చరిస్తున్నాను.

మీరు నన్ను నామినేట్ చెయ్యడానికి ఆచరించ వలసిన పద్దతులు.

1. మీ ఎలక చేత నా URL (http://vihaari.blogspot.com) ను మింగించండి.
2. ఇక్కడికి వెళ్ళి లోపలికి ప్రవేశించండి.అనుమతి లేకపోతే నమోదు చేసుకోండి.
3. అక్కడ post ను మీ ఎలక చేత నొక్కించండి.
4. వచ్చిన URL లో మీ ఎలుక మింగిన నా బ్లాగు పేరును కక్కించండి.
5. ఆదా/భద్రపరచు(save) మీట ను వినాయక వాహనము చేత నొక్కండి.
6. tags వరుసలో దీన్ని ib06 ib06Design మీ ఎలుక చేత మళ్ళీ ఓ సారి మింగించి కక్కించండి.
7. మిగిలిన చోట్ల కూడ మీకు తోచింది రాయండి.
8. ఇక ఒక మంచి పని చేశామన్న తృప్తి తో మీ ఎలుక మీద స్వారి చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళండి.

అన్నట్లు పన్లో పని. ఈ బ్లాగు అలంకారం ఎలా వుందో కూడ ఓ సారి చెప్పి వెళ్ళండి.


ఇట్లు
అమెరికా లో అసాధ్యుడు.
బాల బ్లాగు విహారి

Monday, January 29, 2007

వజ్రోత్సవాలు అభినందించాలో ఆలోచించాలో?

మన సినిమా వజ్రోత్సవాలు ముగిసాయి ఘనంగానే. "శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి". అన్నట్లు టీవీలకు అతుక్కుపోయిన వాళ్ళకు వీలయినంత వినోదం అందించింది.ఎంతో మంది పెద్ద వాళ్ళు తనకు తోచిన విధంగా స్పందించారు వేదిక మీద. కొంతమంది రాసుకొచ్చింది చదివితే మరికొంతమంది ఇంతరులు రాసి పెట్టింది చదివారు ఇంకొంతమంది మనసులో వున్నది చదివారు. ఏదేమయినా ఏ రాష్ట్ర చిత్రసీమా చెయ్యని పని మన తెలుగు చిత్ర పరిశ్రమ వారు చేశారు. కొన్ని పరిశ్రమలు వంద సంవత్సరాలు పూర్తయినా ఎందుకు చెయ్యలేదో అన్న దానికి కారణం మన వజ్రోత్సవాల ముగింపు చెప్పింది. ముగింపెలాగయినా అంత పెద్ద కార్యాన్ని నెత్తినెత్తుకుని( ఎన్ని మొటిక్కాయలు పడ్డా) పూర్తి చేసిన నిర్వాహకులకు నా అభినందనలు.

ఒక్క సారి జరిగిన దానిని ఆత్మావలోకనం చేసుకుందాం.

నాగేశ్వర రావు గారు మాత్రం వజ్రాల్లాంటి మాటలను నొక్కి వక్కాణించారు. సినిమాలు చూసి ప్రజలు పాడయిపోతారు అన్న దాన్ని ఖండిస్తూ సోదాహరణంగా తన సినిమాల గురించి చెప్పారు. అది తన స్వొత్కర్ష కావచ్చు, ఆ సినిమాలందించిన దర్శక రచయితల ప్రతిభ కావచ్చు. వాటిలో నటించింది తనే కాబట్టి ఒక్కో సినిమా గురించీ, దాని సందేశాలను చక్కగా చెపారు.

కళా తపస్వి కె.విశ్వనాథ్ గారు తనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వస్తే ఎలా వుంటుందో తెలీదు కానీ ఈ పురస్కారం అంతకన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చింది అన్నారు.

ఒక్కో రోజు ఒక్కో వ్యాఖ్యాత. మొదటి రోజు కనిపించని అతిథులు(?) రెండో రోజు ప్రత్యక్షం. ఒక్కొక్కర్నీ చూస్తూ వుంటే మనం చిన్నప్పట్నుంచి చూసిన సినిమాల్లో వారు వేసిన పాత్రలు గుర్తుకు రావడము మన ఙ్ఞాపకాల దొంతర్లకు పరీక్షలు పెట్టం జరిగిపోయింది. అన్నీ సవ్యంగా జరిగిపోతున్నట్లు గా అగుపించింది. ఇక చివరిదైన మూడో రోజు మధ్యహ్నాం తరువాత సినిమాల్లో వున్న మంచి క్లైమాక్సును ఇచ్చి వజ్రోత్సవాలకు ముగుంపు పలికి కొత్త పోకడలకు నాంది పలికారు.

ఇక తెర వెనుక్కి వస్తే.....

ఈ ఏర్పాట్లప్పుడు ఏఎన్నార్ గారు చెప్పారు. ఈ ఉత్సవాలకు ఫీజులు పెట్టకండి మనం ప్రజల ద్వారా ఇంత వాళ్ళమయ్యాం వాళ్ళుకు ఇది ఉచితంగా అందివ్వాలి అని. ఆ మాటలను ఎవరూ లెఖ్ఖ చెయ్యలేదు సరికదా ఈ ఉత్సవాలను క్యాన్సిల్ చేద్దాం అని కూడ బెదిరించారు(ట). ఇక తప్పదన్నట్టు ఏఎన్నార్ గారు బయటకు వచ్చేశారట. ఆయన ఓ రెండు లక్షలు ఇచ్చేసి ఇక నేను వీటికి హాజరు కాను అనికూడా చెప్పారట. చివరికి బతిమాలి బామాలి ఆయనను పురస్కారానికి ఒప్పించారు. వజ్రోత్సవ పాట అప్పుడు కూడా తన ని పిలవ లేదట. చివరి నిముషంలో పిలిస్తే రానన్నారట.

ఇక విరాళాలకోసం కొంత మంది ఉదారంగా మరికొంతమంది వికారంగా ఇచ్చారట. చిరంజీవి మొదట 10 లక్షలు ఆ తరువాత ఇంకో అయిదు లక్షలు ఇచ్చారట. ఇక నాగర్జున ఇంకా కొంతమంది దర్శకులు, నిర్మాతలు ఒక్కొక్కరు 5 నుండి 10 లక్షలవరకు ఇచ్చారు(ట). ఇవ్వలేని వాళ్ళకు డోనార్ టికెట్ట్లు 10 అమ్మమని బలవంత పెట్టారు(ట). ఇలా కొన్ని లక్షలో కోట్లో సేకరించ బడ్డాయి.
వేదిక మీద సెట్టింగ్స్ ఒకరు స్పాన్సర్ చేశారు. పాటల దుస్తులు కొంత మంది స్పాన్సర్ చేశారు. ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి మాటీవి వాళ్ళు 1.5 కోటికి పైగా ఇచ్చారు.

ఇంటెర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు అయిన ఖర్చు రోజుకు ఆరు లక్షలు. మళ్ళీ భోజనాల దగ్గరకి ఒచ్చేసరికి మూడు రకాలుగా విభజించారుట. ఇందులో ఎవడు ఎక్కువ డబ్బులు పెట్ట గలితే వాడు స్టార్లను కలిసి ఫోటో తీయించుకోవచ్చట. అంతా డబ్బు మయం. ఈ ఉత్సవాలకు లైట్ బాయ్ నుండి స్టార్ల వరకు అందరూ హాజరవోచ్చని ఎవరైన అనుంటే అది గుర్తుకు ఒస్తే అది మీతప్పే.

ఇక రసవత్తరంగా సాగిన క్లైమాక్స్. ఏ స్క్రిప్ట్ లేకుండా అంత రక్తి కట్టించారంటే మన వాళ్ళకున్న సత్తా ఏ పాటిదో వూహించుకోవచ్చు. ఈ శక్తి ని బయట పెట్టగలిగితే ఓ ఆస్కార్ రావడం అంత కష్టమేమీ కాదు.

ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఎన్నో కొన్ని లోపాలుండడం సహజం. "లోపాల్లేకుండ వున్న వాళ్ళను కోరుకోవడం కూడ లోపమే" అని ఒక పాత్ర ద్వారా చెప్పించారు "పెళ్ళయిన కొత్తలో" రచయిత. అంత ఉద్విగ్నమైన క్షణాల్లో కూడ సమన్వయంతో తరువాత మాట్లడతాను అని చిరంజీవి అనడం ఎంతో హుందాతనంగా వుంది. చిరంజీవి అన్న వాటితో నేను అక్షరాల ఏకీభవిస్తాను. మరింకెవరైనా అంత బాగా చెప్పేవాళ్ళు కాదేమో.

తరువాత చెప్పిన మాటలే నాటకీయంగా చెప్పాడు తనకు లెజెండ్ అవార్డ్ ఇస్తున్నప్పుడే చెప్పాను తనకు ఇది తగదని అని. తరువాత ఆ అవార్డును కాల నాళిక లో వెయ్యడం మరింత రసవత్తరం. మరి మోహన్ బాబు కు కూడా చెప్పేవుంటారు నీకు లెజెండ్ ఇవ్వం సెలెబ్రిటీ ఇస్తామని. అప్పుడు ఏమీ చెప్పకుండ అలా వేదిక మీద చెప్పడం మోహన్ బాబు తప్పే అవుతుంది. మోహన్ బాబుకు కూడ ఆ లెజెండ్ అవార్డు ఇచ్చింటే తను కూడా తన అవార్డుని ఆ కాల నాళికలో వేసే వాడేమో?. అది ఇంకొక మహత్తర ఘట్టం అయ్యెదేమో? ఇరవై అయిదేళ్ళ తరువాత విష్ణు వర్ధనో, రాం చరణో వాటిని బయటకు తీసి వుంటే అప్పుడు చూసే వాళ్ళ కళ్ళు మరింత చెమ్మగిల్లేవేమో?

లోపాలు వుండడం సహజమే. కార్యక్రమంలో తెలియకుండ గమనించకుండ జరిగిన వాట్ని లోపాలనడం సహజమే. ఏఎన్నార్ ను మరిచిపోయి ఆఖరు నిముషంలో అడుక్కోవడం లోపమా? జూ.ఎన్టీఆర్ ను అఖరు నుముషంలో పాట కోసం మద్రాస్ నుండి రప్పించి తరువాత చిత్రీకరణ చెయ్యక పోవడం లోపమా? లెజెండ్, సెలెబ్రిటీ అంటూ వేరు చేయడం సబబా? వ్యక్తుల బిరుదులే కొలబద్దలయితే మోహన్ బాబుకు కూడా పద్మ శ్రీ వుంది, డాక్టరేట్ వుంది ఇంకా రాజ్య సభ సభ్యుడుగా పని చేసిన అనుభవమూ వుంది. అందులోనూ తల నొప్పి అనుకున్న వాళ్ళను అందులో వుంచి వేదిక మీదకు రప్పించడం లోపమా? నిజమే మోహన్ బాబు ముక్కుసూటి గా మాట్లాడుతాడు. అది తన కుళ్ళు అనడం అవివేకమే అవుతుంది. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చినప్పుడు నోరు జారిన మాట వాస్తవం.ఒక్క చిరంజీవి తన కూతురు పెళ్ళికి రమ్మనలేదనడం తప్పు. మిగతా వాటి గురించి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనసులో ఒకటి వుంచుకుని బయటికి ఒకటి మాట్లాడే అలవాటు లేనివాడు మోహన్ బాబు. అలాంటి వాడని తెలిసి పిలిచి తనొద్దన్న సత్కార్యాన్ని ఇచ్చి కాదనిపించుకోవడం ఏమిటి? ఇక్కడ మోహన్ బాబు ని పిలవడం ఓదార్యమంటూ ఎవరైనా ప్రశ్నిస్తే అది "రాజకీయం" అంటా నేను.

ఇందులో మహా మంచి మనిషి అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరి బాకాలు వాళ్ళవి. ఒకప్పుడు మెగా అల్లుడు అంటూ వెంట బడి 10 సినిమాలు బుక్ చేసుకున్న ఉద్ధండ పిండాలు పరిస్తితులు తారుమారయితే మొహం చాటేసిన గోముఖ వ్యాఘ్రాలున్న పరిశ్రమ ఇది. అందులో ఇలాంటివి మనకు వినోదం కలిగిస్తున్నాయి. వాటిలో వినోదమే చూడాలి. ఈ పరిశ్రమ కార్పోరేట్ స్తాయికి ఎదిగింది. వాటి పర్యవసానాలు ఇప్పుడు చూస్తున్నాము.

అందుకే కాస్త అభినందించి కాస్త ఆలోచిద్దాం.

Friday, January 26, 2007

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తోటి తెలుగు బ్లాగర్లందరికి 58 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

నా చిరు ప్రయత్నంగా ఫ్ల్యాష్ లో తయారు చేయబడ్డ చిన్న ప్రజెంటేషన్ చూడండి. సమయాభావం వల్ల వందే మాతరం పాట ను దానికి కలపలేక పోయాను.

ఇక్కడ మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ మనకు స్వాతాంత్ర్యం సిద్దించే క్షణాన మాట్లాడిన మాటలను వినండి.








Tuesday, January 23, 2007

ఆం.ప్ర.మీడియా

ఎవరైనా ఈ బ్లాగ్స్పాట్ చూశారా?

చూడబోతే ఇది చాలా సెన్సేషన్ సృష్టిస్తున్నట్టు వుంది. నిజ నిజాలు ఎవడికి ఎరుకో గానీ చాలా విమర్శనాత్మకంగా వుంటున్నాయి. అక్కడక్కడా కొంచెం పక్షపాత ధొరణి కనిపించినా ఎంతో చైతన్య వంతంగా రాసినట్టి కనిపిస్తోంది.

ఇలాంటివి మన తెలుగు జాతీయ వాది అంబానాథ్ లాంటి వాళ్ళకు మంచి మేత గా ఉపకరిస్తాయి.

ఆం.ప్ర.మీడియా (http://apmedia.blogspot.com)

Friday, January 19, 2007

అందరం మనమందరం...



అందరూ ఇలాగే కలిసి మెలసి వుంటే ఎంత బావుంటుంది. అభిమానుల వ్యాగుద్దాలు..కొండొకచో కొట్టుకోవడాలు వుండవు కదా.

వీటిని చూసయినా డిస్కషన్ ఫోరమ్స్ లో బూతులు మాట్లాడుకోవడం మానేస్తారేమో చూడాలి.

Monday, January 15, 2007

భారత్ కు తిరిగి వెళ్ళడం - ఈనాడు లొ వచ్చిన కథ

కానుక
- వై.సాయిబాబా


కాలిఫోర్నియా
27.09.2006

పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్‌ నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం.

ఇట్లు
మీ కుమారుడు
ప్రదీప్‌

కు్లప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వైదేహీల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి వెుహాలు ఒకరు చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో ఉన్న కోడలూ ఉద్యోగాలకు రిజైన్‌ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్‌ కచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు.

''ఏమిటండీ ఇది?'' భర్తని అడిగింది వైదేహి.
''ఉత్తరం'' సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి వెుహంచూసి చిన్నగా నవ్వి ''నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి'' అన్నాడు.

ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్యమనస్కంగానే గడిపారా ఇద్దరు. సాయంకాలం వాలుకుర్చీలో నడుంవాల్చి అదే ఆలోచనల్లో ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ ప్రదీప్‌ తానిచ్చినదాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడుగా? ఒకవేళ చూసినా, వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికీ దానికీ ఏమన్నా సంబంధం ఉందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాడాయన. దానిని ప్రదీప్‌కి అందజేసిన రోజు జ్ఞాపకం వచ్చిందాయనకు. ఆరోజు...
రెండేళ్ళక్రితం తల్లిదండ్రులను చూడటానికి కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్‌. నెలరోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటిరోజే తిరుగుప్రయాణం. వైదేహి కోడలినీ పిల్లలనూ తీసుకుని తెలిసినవారింటికి వెళ్ళింది. ఇంట్లో తండ్రీకొడుకులు మాత్రమే ఉన్నారు.
''బాబూ... దీపూ!'' గదిలో బ్యాగ్‌ సర్దుకుంటున్న ప్రదీప్‌ తలెత్తిచూశాడు. ఎదురుగా తండ్రి.
''ఏమిటి నాన్నగారూ'' అన్నాడు ప్రదీప్‌.
తన చేతిలోని ఒక ప్యాకెట్‌ కొడుకుకి అందిస్తూ ''ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు'' అన్నాడు సీతారామయ్య.
''ఏమిటిది?'' ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్‌.

''అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేనూ మీ అమ్మా మరణించిన తర్వాతే తెరిచి చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. 'మేము లేము' అని తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటివరకూ దీన్ని ఓపెన్‌ చేయకు'' అన్నాడు సీతారామయ్య. కొడుకు మరోమాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలోనుండి ఇవతలకి వచ్చేశాడు.

కొడుకు 'ఆ ప్యాకెట్‌నుగాని తెరిచి చూశాడా?' అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకి వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహం యధార్థమే... జరిగింది అదే.
ప్రదీప్‌ని గత కొద్దికాలంనుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. స్వంత ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలన్స్‌... జీవితంలో కోరుకున్నవి అన్నీ సాధించినా, వాటి తాలూకు ఆనందం మనసుని తాకడంలేదు. ఇవేవీకావు, ఇంకా... ఇంకా... ఏదో కావాలని ఆరాటం... ఏమిటది? ఏసీ గదిలో భార్యాపిల్లలు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నా, తనకిమాత్రం కంటిమీద కునుకురాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం ఉద్యోగంమీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిస్తే కదా, పరిష్కారం గురించి ఆలోచించడానికి.

చిన్నప్పటినుండి ప్రదీప్‌ చదువులో ఫస్ట్‌. ఇంటర్‌లో ర్యాంక్‌ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఎంతో ఉబలాటపడ్డాడు. స్కూల్‌ టీచరైన తండ్రి తనకంత శక్తిలేదంటే అతి కష్టంమీద ఒప్పించి, తరతరాలనుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే అంకితమైపోయాడు. ఇంజినీరింగ్‌లో కూడా ర్యాంక్‌ రావడం... అతడి మరో చిరకాలవాంఛ- అమెరికాలో ఉద్యోగం... అన్నీ చకచకా జరిగిపోయాయి. తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి, తన చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. ఆరంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంత ఫీలింగ్‌... తనని ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు- రమ్య, సిద్ధార్థ... భార్యాభర్తలిద్దరి ఆర్జన... 'జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను. నాకింక లోటేమీలేదు' అని భావించిన ప్రదీప్‌లో అసంతృప్తి అదృశ్యరూపంలో వెన్నాడటం వెుదలయింది.

ఆరోజు... ఇండియా నుండి వచ్చిన ఇరవైరెండు నెలల తరవాత... అర్ధరాత్రి పన్నెండయ్యింది. ఎప్పటిలాగానే నిద్రపట్టక బెడ్‌రూంలో పచార్లు చేస్తున్నాడు. భార్యాపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. బెడ్‌రూం నుండి రీడింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. కాసేపు ఏదైనా మంచి సంగీతం విని రిలాక్సవుదామని క్యాసెట్‌ కోసం షెల్ఫ్‌ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్‌ శ్రీనివాస్‌ పాటల క్యాసెట్‌ కన్పించింది. ఆ క్యాసెట్‌ తీస్తుండగా, షెల్ఫ్‌లో కన్పించింది తండ్రిచ్చిన ప్యాకెట్‌.

ఇండియా నుండి వచ్చిన తరవాత ఒకటి రెండుసార్లు 'ఆ ప్యాకెట్‌ ఓపెన్‌చేసి చూద్దామా?' అని అనిపించింది. కానీ తండ్రిమీద గౌరవంతో ఆ పని చేయలేక షెల్ఫ్‌లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనబడేసరికి మళ్ళీ కుతూహలం వెుదలయింది. ప్యాకెట్‌ చేతిలోకి తీసుకున్నాడు. 'ఒక్కసారి తీసిచూస్తే' అన్పించింది. కానీ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో 'భావ్యం కాదు' అనుకుని తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయబోయి ఆగాడు. 'తప్పేంటీ? ఎప్పటికైనా చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పినదానికన్నా కొద్దిగా ముందు చూస్తున్నాడు... అంతేగా' మనసుకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది.

'నాన్నగారూ! మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి' అని మనసులోనే అనుకుని సీల్‌ చేసిన ఆ ప్యాకెట్‌ని ఓపెన్‌ చేశాడు. 'తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది' అనుకుని ఆశపడ్డ ప్రదీప్‌కి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. ప్యాకెట్‌ిలో రెండు సీడీలూ ఒక లెటరూ ఉన్నాయి. అంతే... నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్‌ అన్యమనస్కంగానే ఉత్తరం అందుకుని చదవసాగాడు.

''బాబూ, దీపూ! మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేనూ అమ్మా ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చేముందు ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా సడెన్‌గా వచ్చేయవచ్చు. మా మరణవార్త తెలిసిన తరవాత నువ్వెంత ఆఘమేఘాల మీద పరిగెత్తుకు రావాలనుకున్నా, ఆఫీసులో సెలవు దొరికి, ఫ్త్లెట్‌లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప, మా భౌతికకాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించేముందు ప్రతీ తల్లికీ తండ్రికీ తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం... ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేంకాదు. కానీ ఆ అవకాశం మాకులేదు. ఎలా..? ఒకసారి టీవీలో 'మాయాబజార్‌' సినిమా చూస్తున్నా. ఎప్పుడో యాభై ఏళ్ళనాటి సినిమా. అందులో నటించిన యస్వీఆర్‌, యన్టీఆర్‌, సావిత్రి, రేలంగి... వీళ్ళల్లో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి నటనాకౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల గానం ఈనాటికీ మన గుండెలోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించే ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. మనం మరణించాక మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫొటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు 'అదిగోరా మీ తాతయ్య... అదిగో మీ నాన్నమ్మ...' అని చూపిస్తారు. అంతేగా! కానీ మా కంఠస్వరాలు వినలేరు కదా! ఎప్పుడో ఏళ్ళనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, వాళ్ళ మాటలూ పాటలూ వినగలుగుతున్నప్పుడు, మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేం? నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం, మా మాట నీముందుంటుంది. అమ్మానాన్నలను చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికీ? సీడీలు చూడూ...
ఇట్లు
నీ నాన్న''

విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్‌ ఉత్తరాన్ని మడిచి, 'అమ్మ' అని లేబుల్‌ అంటించిన సీడీ తీసి, డి.వి.డి.ప్లేయర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.
తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతులనిండా గాజులు... మూర్తీభవించిన ముత్త్తెదువ రూపంలో చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ అమ్మ...
'బాబూ, దీపూ... మీ నాన్నగారు- అబ్బాయితో ఏమన్నా మాట్లాడు' అన్నారు. 'ఏం మాట్లాడనురా కన్నా? దీపూకి నా మాటకంటే పాటే ఇష్టం. నా పాటే వినిపిస్తాను' అన్నాను. 'మరి నా పాట వింటావా?' వైదేహి అడుగుతోంది ప్రదీప్‌ని.

అవును... అమ్మ అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. రేడియో ఆర్టిస్ట్‌ కూడానూ. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది? అమ్మంత గొప్పగా కాకపోయినా, తనుకూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ... పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమస్థానం తనదే. దానికి కారణం అమ్మపెట్టిన సంగీత భిక్ష. ఇప్పుడీ యాంత్రిక జీవితంలో పడిన తరవాత తనకి సా...పా...సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచనలనుండి తేరుకుని స్క్రీన్‌ వంక చూశాడు.

పూజా మందిరంలో దేవుని ముందు కూర్చుని వైదేహి 'ఎందరో మహానుభావులు' కీర్తన ఆలపిస్తోంది. తరవాత 'నగువోము కనలేని' కీర్తన... అలా వరసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి కీర్తనలు... హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబుర మీటుతూ 'కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ' అంటూ అన్నమయ్య కీర్తనతో వెుదలుపెట్టి, రామదాసు, పురందరదాసు కీర్తనలు... పెరట్లో పూలవెుక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన 'అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ' వంటి లలితగీతాలు పాడుతూ...

సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసిముద్దయిపోతూ ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రదీప్‌కి ఊపిరిపీల్చడమే కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు... అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకీ వచ్చు... అమ్మేగా నేర్పిందీ..? పసితనంలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా... ఎదిగిన తరవాత ఒక గురువులా ఎన్ని పాటలు నేర్పిందీ? ఏవీ ఆ పాటలూ... ఏవీ ఆ మధురానుభూతులూ..? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ... స్నానం చేసినట్టు స్వేదంతో శరీరమంతా తడిసిపోయింది. వణుకుతున్న చేతులతో 'నాన్న' అన్న లేబిల్‌ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్‌లోపెట్టి ఆన్‌ చేశాడు. మల్లెపూవులాంటి పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నాడు.

''దీపూ... బాగున్నావురా బాబూ? 'నాన్న ఏం చెబుతారులే- ధర్మపన్నాలూ నీతిబోధలూ చేసి ఉంటారు' అనుకుంటున్నావు కదూ. అవన్నీ చెప్పడానికి నేనెవరినిరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలివారు కోరుకున్నట్లు తానుండలేని మనిషి, ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు ఉండాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరి సందేశాలూ హితబోధలూ అవసరమా? మరి నీకు ఏం చెప్పాలి? ఆ... లోకంలో సంపదనంతా గుమ్మరించినా కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు. అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాలకంటే మధురమైన నీ బాల్యస్మృతులు ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ళముందే కదలాడుతుంటే నీ స్మృతిపథంలో మేం కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులౌతామేవోనన్న చిన్న ఆశ. దీపూ... నీకు గుర్తుందా..?'' అంటూ సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటీ చెప్పనారంభించాడు...

మిగిలినది ఇక్కడ చదవండి

గమనిక: ఇది 14-జనవరి-2007 ఈనాడు లో వచ్చినది. ఇది నా సొంతం కాదు.

Friday, January 12, 2007

సంక్రాంతి శుభాకాంక్షలు.











అసలు పండు

Thursday, January 11, 2007

మరొక చక్కటి తేనె గూడు.

మన తెలుగు బ్లాగర్ల కొరకు తెలుగు బ్లాగర్లు ,
కూడలి , చందూ ఆన్ లైన్ లాగ మరొక గూడు వచ్చి చేరింది. చక్కటి సదుపాయాలాతో వివిధ రంగులతో మన ముందుకు వచ్చింది. ఇందులో వ్యాఖ్యలు కనిపించే అవకాశం లేదు కానీ "ఈ నాటి బ్లాగులు" "ఎక్కువ చదివిన పుటములు" అనే రెండు కొత్త వర్గాలు వున్నాయి. వీటితో పాటు మన కిష్టమైన వాటిని ఎంచుకునే సౌకర్యం కూడా వుంది.అన్ని మంచి లక్షణాలతో వున్న "తేనె గూడు" మధ్య లో ఓ కందిరీగ కుట్టినట్టు author name నమోదు చేసే చోట ఇలా వుంది.

"Author Name will be used when present, for this listing. Preferably in Tamil".

దీనిని "తేనె గూడు" యాజమాన్యం వారు సరిదిద్ద గలరని ఆశిస్తున్నాను.


ఇంకో సంగతి మీరు మీ బ్లాగును మొదటి సారి "ping" చేస్తే పాత టపాలన్నీ కొత్తవన్నట్టు ఇందులో వచ్చి పడతాయి.

డబ్బు కోసం నల్లులతో కుట్టించు కోవడం.


మొన్నా మధ్య ఓ వార్తా పత్రిక లో చూశా. అక్కడెక్కడో( రాజస్థానో, హర్యానానో) నల్లులతో కుట్టించుకుంటే ప్రతి నాలుగు గంటలకు ఎనిమిది రూపాయలట. విషయమేంటంటే మడత మంచాలు అద్దె కిచ్చే వాళ్ళ మంచాల్లో నల్లులు ఎక్కువవుతున్నాయట. వాటిని చంపడానికి ఖర్చు తడిసి మోపెడు అవుతోందట. వేడి నీళ్ళు పొయ్యడం, నల్లుల మందు వెయ్యడం లాంటివి చేస్తే అద్దె లో సగానికి పైగా దానికే పోతోందట. దానికి ఒక మహత్తర ఉపాయం కనుక్కున్నారు. ఎవరైన వచ్చి నల్లు లకు ఆహారంగా ఆ మంచం మీద పడుకుంటే ఆ నల్లులు ఎంచక్కా ఆ మనిషి రక్తాన్ని వీలయినంత తాగి వెళ్ళి మంచం సందుల్లో వెళ్ళి బజ్జుంటాయట. వాటికి ఒక సారి కడుపు నిండితే మళ్ళీ 8 గంటలు దాకా బయటికి రావట. తరవాత ఆ వచ్చిన వారికి ఆ మంచాలని అద్దెకిస్తారట. వాళ్ళ నిద్రకు 8 గంటలు డోకా లేదని డంకా బజాయించి ఆ "మంచాల యజమానులు" సెలవిస్తున్నారట. డబ్బు కోసం నల్లులకు బలవడానికి కొంతమంది క్యూ లో నుంచుంటున్నారట.



వినడానికి వళ్ళు జలదరించేటట్టు వున్నా ఇది అక్షరాల నిజం.

*** ***

Monday, January 08, 2007

వీసా వచ్చే..... పాస్ పోర్ట్ పోయె......

లండన్ కు పంపిస్తామని మద్రాస్ లో ఉద్యోగమిచ్చి ఒక సంవత్సరమైనా పంపక పోయెసరికి విసుగొచ్చి అమెరికా ప్రయత్నాన్ని మొదలు పెట్టా. అంతకన్న ఎక్కువగా మద్రాస్ బోరు కొట్టింది లెండి. ఒక సంవత్సరం మద్రాస్ లో వున్నా ఒక్క ముక్క కూడా అరవం నేర్చుకోలేదు. దానికి తోడు అందులో పని చేసే కంపెనీ General Manager ప్రాజెక్టు గురించి నోరు విప్పితే అరవం లో అరిచేవాడే వాడే కానీ ఇంగ్లీష్ లో అరిచే వాడు కాదు. ఇక మొదటి ప్రయత్నం లోనే అమెరికా ఉద్యోగం వచ్చేసింది. అప్పట్లో ఒరకిల్ మహత్యం అటువంటిది. "ఒరకిల్ వచ్చా" అంటే "వచ్చు" అని సమాధానం చెబితే చాలు ఇచ్చేసే వాళ్ళు. అమెరికాలో "ఊడిగానికి ఉద్యోగం తయార్" అని రాగానే పాస్ పోర్ట్ పత్రాలు వగైరా వగైరా పంపించిన తరువాత ఇరవై రోజుల్లో వీసా పత్రాలు కూడా వచ్చేశాయ్. అప్పుడు అదో రికార్డు.


ఇక వీసా "ముద్ర" నే తరువాయి. మద్రాసు లోనే ఉద్యోగం చేశాం కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ వున్నారు. ముందు రోజునే స్నానం చేసి అమెరికా కన్సులేట్ కు వెళ్ళా లైన్లో నుంచోవడానికి(దాన్నే పడుకోవడం, పడిగాపులు కాయడం అంటార్లెండి). అక్కడ నాకన్నా ముందు లైన్లో వున్న శ్రీ తాటి చిప్పల్ని మరియూ శ్రీ శ్రీ కొబ్బరి బొండాం చిప్పల్ని దాటి అప్పుడే చార్మినార్ ఎక్స్ ప్రెస్ ,జయంతి జనత ఎక్స్ ప్రెస్, బాంబే ఎక్స్ ప్రెస్ నుండి నేరుగా బ్యాగుల్తో సహా క్యూ లోకి విచ్చేసిన సహచర లైను పౌరులను దాటి వెనకన నిలబడ్డా. తాటి చిప్పలు మరియు కొబ్బరి బోండాం లు అక్కడ దగ్గరలో నున్న బీదా బిక్కి గుడిసెల్లో వున్న పిల్లల రెప్రెజెంటేటివ్స్ అన్న మాట. వాటిని అక్కడ పెట్టి లైను ను రిజర్వు చేసి తరువాత దాన్ని డిమాండు కు తగ్గట్టు అమ్ముకుంటారు.స్వయం ఉపాధి పథకం అన్నమాట. అమెరికన్ కన్సులేట్ వాళ్ళు పరోక్షంగా కూడా ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఆ పవిత్రమైన చిప్పలు వంద రూపాయల నుండి అయిదు వేల రూపాయల వరకు అమ్ముడు పోతాయి. అంతే మరి "మీ అన్ని కష్టాలకు ఆఖరి రోజు ఇదే... అమెరికా అంతా భూతల స్వర్గమే" అని గుర్తు చేసేవి అవే కదా. అమెరిక వచ్చిన తరువాత దాని అర్థం మారుతుంది అది వేరే విషయం.


నేను అలా కొనలేక (కొన బుద్ది కాక సరైన పదం) లైన్లో నిలబడి అక్కడే రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసి చాలా దోమలకు రక్తాన్ని ఉచితంగా అందచేసి నిద్ర వచ్చినప్పుడు అయిదు రూపాయల ధరతో "టీ" లేదా "కాఫీ" అనే మారుపేర్లతో చెలామణీ అవుతూ వుండే వేడి వేడి రంగు నీళ్ళను తాగ&