Friday, May 30, 2008

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను....

:::::::::

అసలు పాట ఆడియో ఇక్కడ

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నీ కోణము
అప్పుడే నీ బ్లాగురా... నీదిరా...

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

జాలమెంత గొప్పదైన బ్లాగుకున్న టపాలల్ల
పదునుముందు సద్దుమణుగురా
గూగులెంత పెద్దదైన ఎదుగుతున్న తెలుగుశైలి
మొక్క ముందు చిన్నదేనురా

యాడులోన యాడొ వుండి సిస్టం ని మింగు స్పైయ్యివేరు
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని బ్లాగరుండ చీపుట్రిక్కులెంచుకుంటు
అడుగుహిట్ల మునుగుతుందిరా

దోష దారులెంతసేపురా
భాషోదయాన్ని ఎవ్వడాపురా
వెలుగుతున్న బ్లాగు కూడా శౌర్యగోళమంటిదేనురా

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

నొప్పి లేని నిముషమేది లైవు యైన స్క్రాపు యైన
ప్రాజెక్టు అడుగుమడుగునా
బాసుచూసెనంటు నిలిచిపోతే కూడలైన నీది కాదు
బ్లాగు అంటే బాహ్య ఘర్షణ

శైలి వుంది శిల్పముంది
కూడలుంది జల్లెడుంది
అంత కన్న సైన్యముండునా

వ్యాఖ్య నీకు వాయువౌను
క్లిక్కు నీకు కీర్తనౌను
సమీక్ష నీకు సారధౌనురా

భీతిలేని బ్లాగుడున్నదా
సాహిత్యమంటు శిశువు పుట్టదా

అగ్రిగేటరంటు వున్న వరకు
భీరువంటు పారిపోక
బ్లాగు పైన భాషపతాక మెగురవేయరా…

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

********************


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి.

విశ్రమించవద్దు ఏ క్షణం.
విస్మరించవద్దు నిర్ణయం.
అప్పుడే నీజయం నిశ్చయం రా.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న
మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి వుండు రవిని మింగు అసుర సంధ్య
ఒక్క నాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి విండ సాగరాల నీదు కుంటు
తూరుపింట తేలుతుందిరా

నిషావిలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుంత గుండె కూడ సూర్య గోళమంటిదేనురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నీరశించి నిలిచిపోతే నిమిముషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ.

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

ఆశ నీకు అస్త్రమవును..
శ్వాశ నీకు శస్త్ర మవును.
ఆశయమ్ము సారధవునురా

నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గలేక.
శవము పైన గెలుపు చాటురా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..


సిరివెన్నెల గారికి క్షమాపణలతో

Tuesday, May 27, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 2

:::::::::

మొదటి భాగం చదివి కాళ్ళు, చేతులు, మొఖమూ కడుక్కోని శుచిగా ఇక్కడికి రండి.అలా న్యూస్ రీల్ అయిపోయిన తరువాత సినిమా ఇలా మొదలవుతుంది.

ఈ సూత్రాలు రాసే ముందు ఒక్కో సూత్రాన్ని విశ్లేషించి ఒక్కో రీలు ఒక్కో టపాగా రాద్దామనుకున్నా కానీ ఇప్పటికే సినిమా రెండో భాగం లో వేసినందుకు కొంత మంది థియేటర్ అభిమాన ప్రేక్షకులకు కోపమొచ్చినందున మొత్తం 11 సూత్రాలు ఇక్కడే ఇచ్చేస్తున్నా :-)


1. బ్లాగు ముఖ్యోద్ధేశ్యం:
మొట్ట మొదటగా బ్లాగును మీరు ఏ ఉద్ధేశ్యంతో ప్రారంభించారు. అందరి నోళ్ళలో నానాలని ప్రారంభిస్తున్నారో లేక మీ వ్యక్తిగత ఆనందం కోసం ప్రారంభిస్తున్నారో లేక గూగులు ప్రకటనలతో నాలుగు రాళ్ళు సంపాదిద్దామని మొదలు పెట్టారో నిర్ణయించుకోండి.


2. ముద్రారాక్షసాలు :
మీరు మొదటిసారిగా టపా రాసేప్పుడు ముద్రణా దోషాలు తప్పవు. ముద్రణా దోషాలు వుంటే మాత్రం చికాకు కలిగించే అంశం.టపాలో వున్న విషయాన్ని బట్టి పాఠకులు స్పందిస్తుంటారు. మొదట్లోనే ఆహా, ఓహో అనిపించేట్టు రాయక పోయినా ఇబ్బంది పెట్టే ముద్రణాదోషాలు రాయొద్దు. ఇప్పుడు బ్లాగులు చాలా ఎక్కువయ్యాయి సావధానంగా చదివి ముద్రణా దోషాలకు స్పందించే వాళ్ళు తక్కువే అని గుర్తు పెట్టుకోవాలి.


3. ఎలా రాయాలి?:
1 పరుగు, 12 బంతులు, అయిదు వికెట్లు వున్నా కూడా గెలుస్తామో లేదో అని టెన్షన్ పడే హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ అభిమాని లాగా కాకుండా 6 బంతులు, 36 పరుగులు, 1 వికెట్ వున్నా తప్పకుండా గెలుస్తామనే రాజస్థాన్ రాయల్సు అభిమాని లాగా ఆత్మ విశ్వాసంతో రాయాలి. మీరేది రాసినా దాన్ని రెండు మూడు సార్లు సమీక్షించుకొని ప్రచురించడం మంచిది. రాసే విషయం లో స్పష్టత అవసరం. బ్లాగుల్లో మన ఇష్టమొచ్చింది రాసుకోవచ్చు కానీ ఆదరణ కావాలంటే మాత్రం స్పష్టత అవసరం. ఇవే ఎక్కువ కాలం మనగలుగుతాయి. మీ టార్గెట్ ఆడియెన్సు ఎవరో ముందుగా తెలుసుకొని అలాంటి వాటి మీద బ్లాగటం ఒక పద్దతి. అలా కాకపోతే మీకు పట్టున్న వాటి మీద మొదలు పెట్టి తరువాత అన్ని రంగాల్లోనూ దూకడం మంచిది. మీ బ్లాగు విజయవంతం కావాలంటే సృజనాత్మకత, పుస్తక పఠనం, స్పష్టత వుండాలి.


4. కొన్నాళ్ళకు ఏమి రాయాలి?:
మొదట్లో మీ దగ్గర వున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్స్ అన్నీ రాసేశారు. తరువాత రాయడానికి ఏమీ లేదు ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు కాలేజీలో రంగారావు చొక్క జేబులోనుండి రెండు రూపాయలు కొట్టేసి మస్తాన్ కొట్లో వన్ బై త్రీ టీ తాగేసిన విషయం వ్రాయండి. వీలయితే లైబ్రరీకి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకం/సినిమా తెచ్చి దాని మీద మీ విశ్లేషణ చెయ్యండి. అలా రాస్తూ పోతే పాఠకులకు మీ మీద ఒక గురి ఏర్పడుతుంది. మొదట్లో అత్యుత్సాహానికి పోయి భూమండలాన్ని బుట్టలో పెడతా, నక్షత్ర మండలాన్ని నాన పెడతా, ఉట్టి మీది వెన్న మింగేస్తా అనే భారీ డవిలాగులు చెప్పకుండా సావధానంగా రాయండి.(నేనయితే ఏ అవిడియా రాకపోతే ఎవరు నేను, ఎవడ్రా రౌడీ, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలు చూస్తా. చప్పున ఓ అవిడియా వస్తుంది.)


5.మీ బ్లాగును ఆదరిస్తున్నారా?:
అన్నింటికి మించి బ్లాగులు రాసిన తరువాత ఆదరణ లేదని నిరుత్సాహానికి గురి కావటం. ఇందాక చెప్పినట్లు ఇది బ్లాగు ప్రయాణం. అందులో ముందుగా రైలెక్కిన వారికి పాత వాళ్ళతో ఎక్కువ పరిచయ ముండటం సహజం. ఆ చనువుతో కొత్త వారికన్నా పాత వారితో పలకరింపులు ఎక్కువుంటాయి. అంతే. అంత మాత్రం చేత మీరు రాసిన వాటికి ఆదరణ లేదని అనుకోవద్దు. కొన్ని టపాలు కేవలం పది మంది చదివి ఆ పది మంది కామెంట్లిచ్చినంత మాత్రాన మీరు రాసింది తక్కువని కాదు. మీ బ్లాగుకు ఎంత మంది వస్తున్నారు అని తెలుసుకోవడానికి స్టాట్ కౌంటరు లాంటివి పెట్టుకోవడం మాత్రం మరచి పోవద్దు. ఇంకా మై బ్లాగ్ లాగ్ లాంటివి వున్నాయి. దీని ద్వారా మీ బ్లాగుకు ఎంత మంది వచ్చారు అన్నది తెలుసుకోవచ్చు. ఏది రాసినా మంచి బ్లాగుకు ఆదరణ వుంటుందన్న విషయం మరచి పోవద్దు.


6. మీ బ్లాగు పదుగురిలో :
మీరు ఒక్క సారి బ్లాగు ప్రారంభించిన తరువాత బ్లాగు అగ్రిగేటర్లతో నమోదు చేసుకోవడం తో మీ పని అయిపోదు. అప్పుడప్పుడూ మీ ఆలోచనలకు సరిపోయే బ్లాగులను చదివి కనీసం నాలుగు లైన్ల కామెంట్లు వ్రాయండి. అలా వ్రాస్తే ఆ బ్లాగు వాళ్ళకు కూడా మీ బ్లాగు మీద ఆసక్తి కలగొచ్చు. ఇది పరస్పర డబ్బా కాకుండా చూసుకోండి. వచ్చిన కామెంట్లకు స్పందించడం మరిచి పోకండి. (ఇక్కడ మాత్రం నన్నొగ్గేయండి. నేను స్పందిస్తున్నానా అని ప్రశ్నించకండి. నేను దొంగయితే దొంగతనం చెయ్యొద్దు అని చెప్పడం మంచి మాటే కదా )ఈ మధ్యనే బ్లాగు ప్రారంభించిన బొల్లోజు బాబా గారి కామెంట్లు పరిశీలించండి. ఆయన రాసిన ప్రతి కామెంటూ స్పష్టంగా వుంటుంది. ఆయన కామెంటు రాయని బ్లాగు బహుశా లేదేమో.

ఎవైనా సీరియస్ విషయాల మీద వ్యాఖ్యానించే ముందు. రాసిన వ్యాఖ్యలను ఒకటికి రెండు సార్లు చూసుకొని వ్యాఖ్యానించడం మంచిది ఎందుకంటే తరువాత చదివేవాళ్ళు మీ వ్యాఖ్యను విభిన్న కోణాలలో పలు సార్లు స్పృజించి వ్యాఖ్యానిస్తారు. అందులో మీరు చెప్పాలనుకున్నది కాకుండా దానికి వ్యతిరేకార్థం స్పురించొచ్చు.


7. బ్లాగులో ఎన్ని రాయాలి?:
ఎన్నయినా రాయొచ్చు చెత్త రాయనంత కాలం.మీరు రాయటం మొదలు పెట్టిన తరువాత కనీసం రెండు వారాలకొక టపా రాయడం మరిచిపోవద్దు. రాయక పోతే జనాలు మిమ్మల్ని మరిచి పోతారు.


8. తెలుగు బ్లాగులలో ఎలా నడుచుకోవాలి?:
ఇప్పటి వరకు తెలుగు బ్లాగులన్నీ సుహృద్భావ వాతావరణం లో నడుస్తున్నాయి. వుంటే సైద్ధాంతిక విభేదాలుండొచ్చు గానీ వ్యక్తిగత విభేదాలను పెంచుకోవద్దు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలకు దిగితే అనవసరంగా నోరు(బ్లాగు) పారేసుకోవద్దు. మనమేం మానవాతీతులం కాదు. అప్పుడప్పుడూ తేలిక పాటి యుద్ధాలు నడుస్తుంటాయి. వాటికి ఫిరంగులు ఫిక్సు చెయ్యకండి. విమర్శనాత్మక చర్చల్లో పాల్గొన్న బ్లాగులో వచ్చిన తరువాతి టపాకు సానుకూలంగా లేదా ఘర్షణాత్మక వైఖరికి దూరంగా స్పందించండి. అది చాలు అంతరాలు తుడిచి పెట్టుకు పోవడానికి. అలా అని మీరు అవతలి వ్యక్తి అభిప్రాయాలను, ఆలోచనలను అంగీకరించినట్టు కాదు.


9. నేను బాగానే రాస్తున్నానా?:
అక్కడక్కడా బ్లామీక్షలు (సమీక్ష) చూసి అందులో నా టపా లేదేంటబ్బా అని భాధ పడకండి. అవన్నీ వ్యక్తిగత ఇష్టాలు అయుండచ్చు. రాస్తూ వుంటే మీరే పెద్ద బ్లాగరు. మీరే పెద్ద సమీక్షకుడు/సమీక్షకురాలు.


10. ఏవి రాయకూడదు?:
బ్లాగుల్లో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా రాయకుండా వుంటే మంచిది. రాసినా తగు జాగ్రత్తలు తీసుకోని రాయండి(ప్రత్యేకంగా ఆడవాళ్ళు). బ్లాగుల్లో ఎక్కువగా చిన్న తనం లో జరిగిన విషయాలు, జీవితానుభవ పాఠాలు రాయడం కద్దు. అలా రాసేప్పుడు అందులోని వ్యక్తుల పేర్లు మార్చి రాయడం మంచిది. ఇంకా అంతర్జాలం చీకటి కోణమెటువంటిదో తెలుసుకోవాలంటే సాలభంజికల మరో మెట్టు చదవండి.


11. బ్లాగులే జీవితం కాదు:
బ్లాగుల ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతో మంచి రచనలతో, పెద్ద రచయితలతో పరిచయభాగ్యం జరగచ్చు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుని వ్యక్తిత్వ వికాసానికి సాయ పడవచ్చు. కానీ మీ వ్యక్తిగత జీవితాలను, దైనందిన వ్యాపకాలను పక్కన పెట్టే అంతగా వుండకూదదు. మీరు అంతర్జాలం లో దొరికే అడ్డమైన చెత్తా చదివే వాళ్ళయితే మాత్రం తెలుగు బ్లాగులు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చివరగా వీవెనుకు జల్లెడోళ్ళకు ఓ సలహాభ్యర్థన : కూడలి రైలు పెట్టెకి కూడలండ్రెడ్ లా 'లేత బ్లాగర్లు' అనే పెట్టె తగిలించమని అభ్యర్థన. ఇందులో గత వందరోజులలో నమోదు అయిన లేదా ప్రారంభించబడిన బ్లాగులు వుంటే వారిని ప్రోత్సహించడానికి అనువుగా వుంటుంది.

అనంద బ్లాగింగ్ (Happy blogging)
:::::::::

Thursday, May 22, 2008

ఈ వారం సిద్ధా-బుధ్ధ (డాలరు, కొత్త పార్టీ)

:::::::::


"అయ్యగారూ"
"ఏరా సిద్ధా"

"మనకు అమెరికా డాలర్ విలువ పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా"
"మనకు అంటే ఇక్కడ రెండు రకాలున్నాయి. మన ప్రవాసాంధ్రులకా? లేక మన దేశ ప్రగతి కా?"

"ఆ లెక్కలు నాకు తెలీవు. రెంటికి తేడా ఏంటో చెప్పండి."
"డాలరు విలువ పెరిగితే మన ప్రవాసాంధ్రులకు మంచిది. ఇప్పుడున్న విలువ ప్రకారం ఒక డాలరుకు 42.60 పైసలు రావచ్చు. ప్లాట్లు కొనే వాళ్ళు ఓ వంద చదరపు అడుగులు ఎక్కువగా, భూములు కొనే వాళ్ళు ఓ అరెకరం ఎక్కువగా కొనుక్కోవచ్చు. అలాగే భారత్ లో వున్న ఎగుమతుల కంపెనీలకు కూడా లాభం. కాకపోతే దేశం లోకి దిగుమతి అయ్యే వస్తువులకు పైకం ఎక్కువ చెల్లించాల్సి వుంటుంది. ఇక దేశ ప్రగతి అనేది ఆ దేశపు కరెన్సీ మారకపు విలువ మీద ఆధార పడి వుంటుంది. డాలరుకు తక్కువ రూపాయలొచ్చే కొద్దీ మన రూపాయి బలపడు తున్నట్టు, దేశం అభివృద్ది చెందినట్లు లెక్క. "

"అంటే రూపాయి విలువ పడి డాలరు విలువ పెరిగితే మన దేశ సేవకులు స్విస్ బ్యాంకు లో పెట్టే డబ్బు తక్కువవుతుందన్నమాట.ఆ మధ్య ఓక్సు వాగన్ ఫ్యాక్టరీ కోసం పది కోట్లు అడ్వాన్సు ఇచ్చారు. అది తిరిగి వచ్చిందా ?"
"ఆ కంపెనీ వాళ్ళు ఖర్చులకింద రెండు మిలియెన్ యూరోలు మన ప్రభుత్వానికి ఇచ్చారు."

"ఏదో రూపం లో డబ్బు తిరిగి వచ్చిందన్నమాట. ఆ డబ్బు ప్రభుత్వానికిచ్చారా బొత్స సత్యనారాయణకిచ్చారా? "
"నువ్విలా అడిగితే ఎలా రా. ప్రభుత్వం పేరు మీద ఇచ్చారు. ఎవరికెళ్ళిందో తెలీదు. "

"ఆ కంపెనీ కోసం సేకరించిన భూమి కూడా జనాలకు తిరిగిచ్చారా?"
"తిరిగిచ్చేస్తే దాన్ని ప్రభుత్వం అనరు."

"మరి?"
"తమకు తిరిగివ్వమని రైతులు మొత్తుకుంటుంటే ప్రభుత్వం వాళ్ళు సైలెంటుగా అమ్మేసుకుంటున్నారు."

"అందుకే ఇలాంటి ప్రభుత్వం పోయి మా లాంటోళ్ళందరికి న్యాయం జరగాలంటే మా చిరు రావాల్సిందే."
"ఏంటి నువ్వు మొన్న హాజరయిన సెమినార్ లో ఇవి కూడా చెప్పారా?"

"లేదు ఆ సెమినారుకు వచ్చిన వాళ్ళలో చాలా మంది ఆ కొత్త పార్టీకి అభిమానులట."
"ఓహో, సెమినార్ లు పెడితే చాలా లాభాలున్నాయంటావ్."

"అవును ప్రవాసాంధ్రులు కూడా చాలా సెమినార్లు పెడుతున్నారు. మీరు చూడలేదా?"
"సెమినార్లేం ఖర్మ. ఏ రాజ కీయ నాయకుడొచ్చినా దిగంగానే సూట్ కేసులు మోసే చాలా ప్రవాసాంధ్రులను చూశా."

"వాళ్ళకు సూట్ కేసులు మోసే ఖర్మేమిటి. మరీ చోద్యం కాకపోతే."
"దేశ సేవ నాయనా. దేశ సేవ. తరువాత ఏ ఎమ్మెల్యే టికెట్టో, ఎం.పి. టికెట్టో వస్తే ప్రజలకు దగ్గరగా వుండి సేవ చెయ్యొచ్చని."

"అంటే ప్రవాసాంధ్రులు రాజకీయాల్లోకి రాకూడదా?"
"నువ్వు వేరే అర్థాలు తీయకురా అక్కుపక్షీ. రాకూడదని ఎవరన్నారు. భేషుగ్గా రావచ్చు. అలా వచ్చే వాళ్ళను స్వాగతిద్ధాం. సరే మీ రైలెప్పుడు వస్తోంది?"

"అన్నీ రెడీ అయిపోయాయి పెయింటింగ్ మాత్రం మిగులుంది. రేపో మాపో పట్టాలపైకి వచ్చేస్తుంది."
"మీ రైలొచ్చేలోపే బాలయ్య కూడ రైలెక్కుతున్నాడట గా"

" ఆయనెక్కుతున్నది పాత రైలు.ఇప్పటికే చాలా చోట్ల రిపేర్లొచ్చాయి. మా రైలయితే చాలా ఫ్రెష్షు. కొత్త టికెట్లు, కొత్త సీట్లు, కొత్త బోగీలు. బాలయ్య ఎక్కే రైలుకు టికెట్లు కూడా కొనక్కరలేదు. ఎన్టీఆర్ ఇచ్చిన రైలు పాస్ జేబులో రెడీ గా వుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కచ్చు. కొత్తగా ఎక్కేదేముంది రెక్కమాను డొక్క."

:::::::::



"అయ్యా నేను ప్రజల్లో ఒక్కడినేనా?"
"అవును"

"మీరు?"
"నేను కూడా"

"చిరంజీవి?"
"ప్రజల్లో ఒక్కడే"

"వై.ఎస్?"
"వై.ఎస్. కూడా ప్రజల్లో ఒక్కడేరా."

"చంద్ర బాబు కు కల్లో కూడా ప్రజలే కనిపిస్తున్నారట కదా. మీరు, నేను, చిరంజీవి, వై. ఎస్సూ అందరూ ప్రజలయితే మరి చంద్ర బాబెవరు?"
"ప్రజల్లో లేని వాడు అందుకే ప్రజల మధ్యకు వెళుతున్నాడు."


:::::::::


ఓ చిన్న బ్లాగాభిప్రాయ సేకరణ:



:::::::::

Wednesday, May 21, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 1

:::::::::

మట్టిబుర్ర, ఒట్టి బుర్ర, తొట్టి బుర్ర, బంక బుర్ర కాదేదీ బ్లాగడానికి అనర్హం

అదేమిటి సూత్రాలేవన్నా వుంటే పది వుండాలి లేకుంటే పన్నెండు వుండాలి కానీ అనుకుంటున్నారా?
అక్కడే చూపించాలి కొత్తదనం. ఆ కొత్తదనం అనేది వైవిధ్యంగా వుండాలి. వైవిధ్యం పేరు చెప్పి నన్నయా, తిక్కనా క్లాస్ మేట్స్. వాళ్ళిద్దరూ ఎదురు బొదురు ఇళ్ళలో వుండే వాళ్ళు అని చెప్పేస్తే బ్లాగులోకి బుల్లెట్లొస్తాయ్. కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి.

సరేనోయ్ ఇదెందుకు రాస్తునావో ఒక ముక్క చెబ్తావా?
గత ఆర్నెల్లుగా బ్లాగులు రాసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కువయ్యారు అంటే మొదలు పెట్టే వాళ్ళు మాత్రమే ఎక్కువయ్యారు అని అర్థం. అవి కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మందయ్యారు. బ్లాగు పేర్లు నమోదు చేసుకొన్న వాళ్ళు చాలా మంది. అలా నమోదు చెయ్యడం కూడలి లో కావచ్చు, జల్లెడ లో కావచ్చు, తేనె గూడు లో కావచ్చు, తెలుగు బ్లాగర్స్ లో కావచ్చు. ఇంకా చక్రెడో అని ఒకటుందనుకుంటా. ఇప్పుడు ఇండీబ్లాగర్స్ అని ఒకటి వచ్చింది. అలా ప్రారంభించిన లెక్క చూస్తే ఎనిమిది వందలకు పైగా వుండొచ్చు. మొన్నా మధ్య కూడలి కొచ్చే యునీక్ హిట్లు ఎంత అని వీవెన్ ను అడిగితే సాధారణ రోజుల్లో 300+. వారాంతాల్లో ఇంకా తక్కువ అన్నారు. నేనయితే ఈ ఎనిమిది వందలు కాకుండా ఇంకో అయిదు వందలు ఉంటారు. తక్కువలో తక్కువ ఓ వెయ్యి మంది రోజూ బ్లాగులు చదువుతుంటారనుకొన్నా. వాస్తవంగా అది నిజం కాదు అని తెలిసి కళ్ళలో నీళ్ళు కారబోతుంటే స్పాంజి పెట్టి ఆపి బాధ పడ్డా. జల్లెడ, తేనె గూడు, తెలుగ్ బ్లాగర్స్కు ఎంత మంది వస్తారో తెలీదు(కనుక్కోలేదు సరైన సమాచానం).

బ్లాగులంటే ...
అమెరికాలో అయితే "హౌ టూ డ్యాష్ ఎఫెక్టివ్లీ" (డ్యాష్ ఖాళీలో ఏదైనా పూరించుకోండి) అని ఒక పుస్తకం రాస్తే మూణ్ణెల్లలో ఆరు ముద్రణలకు నోచుకుంటుంది. డిల్లీ సెంట్రల్ హాల్లో లైట్లేసి ఆ రచయితకు కలువభూషణ్ అని బిరుదు కూడా ఇస్తారు. మన తెలుగు వాళ్ళు అట్టే పుస్తకాలు (కొని) చదవరు. ఎక్కడన్నా పుస్తకం దొరికితే "మాస్టారూ, దీన్ని పట్టుకెళ్ళి చదివేసి రేపు ఉదయం మీ ఇంటి ముందు మీరు ముగ్గెయ్యక ముందే తెచ్చిస్తా" అంటారు. ఆ పుస్తకం తిరిగొస్తే టి.వి.యాంకరమ్మ తెలుగు మాట్లాడినంత ఒట్టు. ఇప్పుడు పుస్తకాలు కొనే వాళ్ళు తక్కువై పోయారు. వీళ్ళందర్నీ లైన్లో నిలబెట్టి ఆ లైన్లో నడుచుకుంటూ ముందుకు వస్తే నా మొహం రెండోది అయుంటుంది.అరువు ఇచ్చేవాళ్ళు అంతకన్న తక్కువై పోయారు. పాపం వీళ్ళనెందుకు అవమానించడం అని వీళ్ళని కూడా లైన్లో పెడితే, ఈ లైన్లో నా మూడు క్యాండిల్స్ మొహం మొదట కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పుస్తకాల కొరత తీర్చడానికి అంతార్జాలమొచ్చింది. దాదాపుగా ఏది కావాలన్నా అందులో దొరుకుతుంది. దాని నెత్తి మీద గూగులొచ్చింది. అందువల్ల పుస్తకాలు కొనే వాళ్ళు లేరు, అడుక్కునే వాళ్ళు లేరు. ప్రతి దానికి గూగ్లేయడమే.(కొంత మంది పద్దతి గా అజో విభో ఫౌండేషన్‌ కి వెళ్ళి పుస్తకాలు కొంటారు) అలా వెబ్ లో చాలా విషయాలు లాగుతున్న వాళ్ళ లోంచే పుట్టికొచ్చిందే ఈ బ్లాగ్.

అందులో తెలుగు వాళ్ళు లేకపోతే ఈ టపా రాసే అవసరముండేది కాదు. అలా ఎప్పుడూ తెలుగు వార్తలు, కథలు, నవలల కోసం వెదుకుతున్న వాళ్ళందరూ కలిసి ఈ వెదుకులాటకు ఏదైనా పేరు పెట్టాలనుకొన్నారు. కానీ మన పక్క నున్న పక్క రాష్ట్రం వాళ్ళు వుంటే తమ పేరు పెట్టుకోవడం కష్టమని గ్రహించి వాళ్ళందర్ని ఒక రూములో కట్టేసి, పులిహోర పేకెట్లు, దద్ధోజనం పేకెట్లు ముందర పడేసి దీనికి "వెబ్ లో లాగుడు" అని పేరు పెట్టారు. కాల క్రమేణా అది "వెబ్ లాగుడు" అయింది. ఇది చూసిన ఫ్రెంచి వాళ్ళు, డచ్చి వాళ్ళు "మాకు డు పలకడం రాదు" అని దానికి "వెబ్ లాగు" అని పేరు పెట్టారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వక పోయిన ఫరవా లేదు కానీ నవీనంగా మేము కనిపెట్టినదాని పేరు మారుస్తారా? అని అడ్డం పడ్డారు మన వాళ్ళు. "లాగు అంటే మా ఐ.ఎస్.ఐ. మార్కు పట్టా పట్టీల నిక్కరు కాబట్టి మేమొప్పుకోం" అని తెలిసినోళ్ళందరికీ ఈ-మెయిల్ పంపించారు. ప్రతి ఈ-మెయిల్ లో కింద మీరొక్కరికి ఫార్వర్డ్ చేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆరు సెంట్లిస్తారు అని నోట్ కూడా పెట్టారు. సరిగ్గా ఈ సమయం లోనే పంధ్రాగస్టు స్పీచిలు టి.వి.లో చూడ్డం జరిగింది. సో అందరూ అదొక ఉద్యమంగా తీసుకొని ఈ డచ్చి వాళ్ళని ఇప్పుడే ఆపకపోతే తరువాత బ్రిటీషు వాళ్ళొస్తారు ఆ తరువాత నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తారు అని డచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. పిల్లులు రొట్టె కోసం పోట్లాడుకుంటుంటే కోతి రావాలి కదా వెంటనే అదోచ్చి (పజిల్: ఎవరో మీరే చెప్పుకోవాలి) "వె..వ్వె..వ్వె.." అని వె పీకేసి "బ్లాగు" అని నామకరణం చేశారు. ఎవరన్నా బ్లాగు ఎలా పుట్టిందని వేరే వాళ్ళు చెబితే నమ్మకండి. ప్రత్యేకంగా పశ్చిమ దేశస్తులను. మీ ఇంట్లో పెద్ద రాళ్ళు గట్రాలుంటే వాటి మీద ఈ స్టోరీ ఎక్కించేసి మీరు నీళ్ళకోసం తవ్విన ఖాళీ బావిలో పెట్టి చుట్టూ రెండు పాత రాగి రేకులు వేసి పాతెయ్యండి. పాతేసి మన తెలుగు ప్రాచీనాన్ని కాపాడండి.
ఈ టపాకి సంబందించిన బ్లాగు నిర్వచనం అయి పోయింది.


మీరు కొత్తగా బ్లాగు ప్రారంభించిన తరువాత కామెంట్లు రాక పోవడమో, హిట్లు రాకపోవడమో జరిగి "బ్లాగు గతి ఇంతే.." అని విరహ గీతాలు పాడుకోవద్దు. నా లాగే రాసిన వేరే కొన్ని టపాలకి కామెంట్లొస్తున్నాయి గానీ నాకు రావట్లేదు అని విచారానికి గురి కావద్దు. ఈ బ్లాగు ప్రయాణం అనేది రైలు ప్రయాణం లాంటిది. మీకన్నా ముందే రైలెక్కిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం సహజం. దాన్ని చూసి నిరాశకు లోను కావద్దు.

ఈ బ్లాగు ప్రయాణం లో నాకు కనపడిన రైళ్ళు రెండు ఒకటి 'కూడలి', రెండు 'తెలుగు బ్లాగర్స్'. నేను చూసినప్పుడు అవి మీటర్ గేజీ మీద నడుస్తుండేవి. ముందరో ఇంజెను పెట్టె వెనకో ప్యాసింజెర్ పెట్టె వుండేవి అంతే. ఈ రైల్లో పని చేసే డ్రైవరూ, గ్యాంగ్ మెన్, టికెట్ మాస్టర్ తదితర ఉద్యోగ వర్గమంతా ఎవరో బాగా తెలిసేది. అలాగే అందులో ప్రయాణించే వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా తెలిసే వారు. రాను రాను ప్రయాణీకులెక్కువయిపోయారు రైలు పెట్టెలెక్కువయి పోయాయి. కూడలి కయితే ఏ.సి., నాన్ ఏ.సి. లాగా రకరకాల పెట్టెలు కలిసాయి. ఆ పెట్టెలకు పేర్లు పెట్టేశారు కూడలండ్రెడ్ , సాహిత్యం, రాజకీయం, హాస్యం, సేకరణలు, సినిమా అని. ఇప్పుడు అది బ్రాడు గేజీ మీద నడవడమే కాకుండా సూపర్ ఫాస్టు రైలు బండిలా పరిగెడుతోంది. తేనె గూడు కూడా బ్రాడ్ గేజులో కొచ్చేసింది. తెలుగు బ్లాగర్స్ కాస్త స్లోగా నడుస్తోంది. దట్స్ తెలుగు వాళ్ళు కూడా బ్లాగు బాట పట్టారు.

కొత్త బ్లాగోడి మనసు ఎలా వుంటుందో ఫ్ల్యాష్ బ్యాకు లో చదువుకోవాలంటే ఖైదీ నంబరు 300 కెళ్ళి కాసేపు చదువుకోండి.

సుత్తి సరే విషయమెక్కడ?
వస్తునానన్నా వస్తున్నా. అక్కడికే వస్తున్నా. సినిమా మొదలయ్యే ముందు మంచి అడ్వర్టైజ్మెంట్లు వుంటాయి. ఎందుకనుకుంటున్నారు? సినిమా బాగా లేకపోతే అవి చూసిన తృప్తయినా మిగులుతుందేమో అని. అందుకే నేను బోనస్ లు ఇస్తుంటా. ఫ్లాపు సినిమా కెళ్తే ఆడియో సి.డి.లు ఉచితంగా ఇవ్వడమనే ప్రక్రియే నాకు పూర్తి స్పూర్తి.

సరే అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది సినిమా మొదలు పెట్ట వేంటి?
అక్కడే మెక్సికో లో పండించిన పెసర పప్పు లో కాలేశారు. సినిమా థియేటర్ లో అడ్వర్టైజ్మెంట్ తరువాత ఏఁవొస్తుంది? న్యూస్ రీల్ రాదా? అన్నీ చెప్పాలి...ఈఁ

మేము న్యూస్ రీల్ చూసి చాలా కాలమయింది. మీది పాత థియేటరా?
అవును పాత థియేటరే. ఇది నా థియేటరే కాబట్టి న్యూస్ రీలు పూర్తి కాకుండా సినిమా మొదలవదు. డెత్ నట్లు చూడాల్సిందే. ఈ టైములో గేట్లు మూసేస్తాం బయటికెళ్ళలేరు. ఇక న్యూస్ చూడండి.

భారత్ ఇండియా పెద్ద లోగో..
చిన్న లొగో...
ఇంకా చిన్న లోగో...
చిన్న చుక్కయిన లోగో ...
ఏమీ లేని లోగో...

ఇప్పుడు వెనక గ్రవుండు లో పాట

మన్మే హై విశ్వాస్....
మన్మే హై విశ్వాస్....

పాట ఎక్కువ సేపు వుండదు. బట్టీ పట్టేసి పార్లమెంటుకొచ్చి పాడతారని భయం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ అందిస్తున్న వార్తలు

ఏడమ వైపు తాడు కాలిపోతూ ..కుడి వైపు తొలకరి వాన పడుతున్న వెండి తెర పై..

గూని పల్లెలో శంఖు స్థాపనలు.
కోడి ఈకల పాలెం లో శంఖు స్థాపనలు.
బుట్టాయి గూడెం లో శంఖు స్థాపనలు.
ఐతె పల్లె లో శంఖు స్థాపనలు.

న్యూస్ రీల్ అయిపోయింది.

అసలు సినిమా రెండో భాగంలో మొదలవుతుంది.

:::::::::

Wednesday, May 14, 2008

ఈ వారం సిధ్ధా- బుధ్ధ (గోల్డు క్వెస్టు, మహిళా బ్లాగర్ల సమావేశం )

:::::::::


"అయ్య గారూ.."
"ఆఁ, సిద్ధా! "

"నాకు.. నాకు.. "
"ఆ నసుగుడెందుకు విషయం చెప్పు.. "

"నాకు సెలవులు కావాలి? "
"ఓస్ అంతేనా దానికెందుకు నసగడం. నువ్వడగడం నేను కాదనడమూనా. "

"మీరివ్వరని కాదు గానీ మొన్నా మా సంఘపోళ్ళు పెట్టిన మీటింగుకు వెళితే యజమానులను మెప్పించడమెలా అనే దాని మీద సెమినార్ ఇచ్చారు. అందులో, యజమానంటే భయపడుతున్నట్టు నటించడం ఒక టెక్నిక్ అంట. అందుకే అలా నసిగా. "
"బావుంది. నటించడమేనా ఇంకా గొడ్డళ్ళతో, గన్నులతో, పెన్నులతో భయ పెట్టి పనులెలా చేయించుకోవాలో కూడా చెప్పారా? "

"అది రెండో సెమినార్ లో చెబుతారంట. దానికి ఫీజు కట్టాలంట. "
"అలా అయితే నీకు పెర్మనెంట్ సెలవులు ఇస్తా. తీసుకుంటావా? "

"అయ్య బాబోయ్ అలా అంటా రేంటండీ. నేనేదో సరదాకెళ్తేనో. అది కూడా మా రంగడు బలవంత పెట్టి తీసకబోతే. "
"రంగడంటే గోల్డ్ క్వెస్ట్ గాడేనా? "

"అరె భలే గుర్తుపట్టేశారే. మీక్కూడా తెలుసా. "
"తెలుసా ఏంట్రా బాబూ, మొన్న నువ్వు బయటికెళ్ళినప్పుడు నీ కోసమొచ్చి గోల్డు క్వెస్టు గురించి చెప్పి నా మెదడు ఫలహారం కింద మింగేశాడు. . "

"రజనీకాంత్ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ అందరూ ఇందులో వుండారని చెప్పాడా? "
“వాళ్ళ పేర్లు చెప్పలేదు గానీ ఇంకో పది మెట్లెక్కి ఇందులో అమితాబచ్చన్, ధీరూ భాయ్ అంబానీ, ముఖేష్ అంభానీ, బిన్ లాడెన్, ఫీడెల్ కాస్ట్రో ఫ్యామిలీ వాళ్ళు కూడా వున్నారని చెప్పాడు. "

"వీడి దుంప తెగ. అమ్మో వీడు చంద్రమోహన్ దగ్గర ట్రైనింగు తీసుకున్నానని చెప్పాడే. చూడబోతే చంద్ర మోహన్ కే ట్రైనింగు ఇచ్చినట్లు వున్నాడు. వీడిని ఈ సారి మైకు పెట్టి సతికేస్తా. "
"సతికితే సతికావు గానీ తమ్మా రెడ్డి భరద్వాజ లాగ బి సీరీసు, జి సీరీసు పదాలు టి.వి. కెమరా ముందు మాట్లాడకు. పేపరోళ్ళు నిన్ను హెడ్లైన్లో పెట్టి నన్ను బాక్స్ అయిటం చేస్తారు. "

"మీరూరుకోండి. ఇప్పుడు పేపర్లో మన గురించి రాసేంత చోటెక్కడుంది వాళ్ళకి. అంతా ఉప ఎన్నికల గురించి రాస్తున్నారు. కొద్దో గొప్పో ఖాళీ వుంటే నాలుగేళ్ళ పాలనలో ప్రగతి అంటూ ఊదర కొట్టుకుంటారు. ఈ సారి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? "
"ఇంకెవరు టి.ఆర్.ఎస్. "

"మీరు కూడా అలా డిసైడయిపోయారా. ఏటూ వాళ్ళే గెలుస్తారని తెలిసినప్పుడు వాళ్ళ వల్లే ఎన్నికలొచ్చాయని వాళ్ళకు బుద్ది రావాలంటే ఓడించండి అని ఇతర పార్టీలు అరవడమెందుకు? హాయిగా వాళ్ళకే వదిలేసుంటే ఎన్నికల ఖర్చు మిగిలేది, సమయం ఆదా అయ్యేది. అప్పుడు మేమే అనవసర ఖర్చు ఆప గలిగాం అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకొని నిజంగా ఇది ‘మీ కోసం’ అని బాబు చెప్పుకొనుండచ్చు. వై ఎస్సేమో ఈ డబ్బును ప్రాజెక్టులకు ఖర్చు పెడతాం అని ప్రజల దగ్గర మార్కులేయించుకొని వుండచ్చు. ప్చ్... చాన్సు మిస్సయింది. "
"ఏంటి మీ సంఘం మొదటి సెమినార్లో ఇన్ని విషయాలు చెప్పారా? మీటింగుకు వెళ్ళొచ్చిన తరువాత తెలివి తేటలు బాగానే పెరిగాయే. "

"అప్పుడే ఏమయ్యింది బ్లాగులో మహిళ లందరూ సమావేశం పెడుతున్నరు గదా. మా ఆడది కూడా సమావేశానికి వెళతానని సంబర పడుతోంది. అప్పుడు చూడాలి నా సామి రంగా మా ఓల్ ఫ్యామిలీ తెలివితేటలు. "
"నిన్ను బ్లాగులు చదవమని చెబితే ఆ దురద మీ ఆవిడకు కూడా అంటిస్తావా? ఇంతకూ వాళ్ళేం మాట్లాడు కుంటున్నారో తెలుసా? "

"వాళ్ళు అసలు విషయం చెప్పట్లేదు. అందుకే గదా గూఢచారి లా మా ఆడదాన్ని పంపిస్తోంది. మీరు అట్లా ఏమీ తెలీనట్లు నటించండి. గుట్టంతా మా ఇంటిదాని చేత చెప్పిస్తా. అప్పుడు అవన్నీ మీ బ్లాగులో పెట్టుకోవచ్చు. "

"అవుడియా బానే వుంది కానీ. మీ ఆవిడ కూడా ఒక బ్లాగు మొదలు పెట్టేస్తే పరిస్థితి ఏంటి? "
"అవునండోయ్, అప్పుడు తాకిడికి గురయ్యేది మీ కంప్యూటరే. మనకు టైము దొరకదు. "

"వాళ్ళేమి మాట్లాడుకోని వుంటారో నాకు బాగా తెలుసు. "
"అదేదో నా చెవిన కూడా పడెయ్యండి. "

“... దు....”
"ఓహో అలానా...”

“.........కు.....”
"ఇంకా.... "

"…తె... "
"అమ్మా ఇవి కూడా? "

".....నా..... "
"అయ్య బాబోయ్"

"...లీ..... "
"నా కళ్ళు తెరిపించారు కదా. "

"రా........ "
"అలాగే ఎవరికీ చెప్పనులెండి. "

"వీళ్ళ మీటింగుకు నేదురుమిల్లి రాజ్యలక్ష్మిని పిలుచుంటే ఏమయ్యేది? "
"సమావేశం పేరు ప్రమదావనం కాకుండా ఇందిరా మహిళా బ్లాగర్ల సమేవేశం అయుండేది"

"వై.ఎస్. ను పిలుచుంటే? "
"సోనియమ్మ మహిళా బ్లాగర్ల సమావేశం అయుండేది. హైదరాబాద్ లో జరిగే సమావేశానికి రాజీవ్ బ్లాగర్ల సమావేశం అని పేరు పెట్టుకోమని పోరొచ్చుండేది"

"జగన్ ను పిలుచుంటే? "
"సాక్షి మహిళా బ్లాగర్ల సమావేశం అని పిలిచి అందరి ఫోటోలు తీసుకొని రెండు రూపాయలకే అన్ని పత్రికలూ రావాలని నినదించిన మహిళా బ్లాగర్లు అని ఫ్రంటు పేజి లో వచ్చుండేది. "

"బాబును పిలిచుంటే? "
"మీ కోసం మహిళా బ్లాగర్ల సమావేశం అని చెప్పి రోజాను పంపించి వుండే వాడు. "

"కె.సి.ఆర్. ను పిలిచుంటే? "
"............."

"చెప్పవేరా? "
"............"

"ఎందుకలా పారి పోతున్నావ్? "
"............"

"చెప్పు ఎందుకలా పారిపోతున్నావ్? "
"ఇంకా అర్థం కాలేదా?.... సింబాలిక్ గా చెప్పా. "



:::::::::

Tuesday, May 13, 2008

భ్లాగర్ల కథ ( నా వల్ల కాదు )

తప్పకుండా చదివాల్సింది:

పొద్దులో కొల్లూరి సోమశంకర్ గారు రాసిన బ్లాగర్లకో లేఖ చదివిన తరువాత నా డ్రాఫ్టు తవ్వకాల్లోంచి దీన్ని బయటకు తీసా. ఇది నూరో టపాగా విడుదల చెయ్యాల్సి వుండె. పూర్తి చెయ్యడం చేత కాక దీని బదులు బ్లాగోళ జంభ వీడియో విడుదలచేశా. పొద్దులో రాసిన సోమశంకర్ గారికి అభినందనలు. మీరింకా చదవక పోతే ఓ ట్రిప్పేసి తరువాత ఇక్కడికి రండి. ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇంకొక ఉదాహరణ. మీ బుర్ర స్క్రీన్‌ పై తళుక్కుమన్న "ఇలాంటివి మాట్లాడ్డం నీ కలవాటే గా" అన్న అక్షరాలు బర బర చెడిపెయ్యండి. మళ్ళీ నా మీద సెటైరెయ్యకండి.

తప్పకుండా చదవాల్సింది ఇంకొంచెం:

కింద రాసిన బ్లాగుల పేర్లే కాకుండా ఇంకా చాలా రాయాల్సి వుంది వాటిని రాయడానికి కుదరక మధ్యలో ఆపేశాను. ఇందులో ఉదహరించ బడ్డ బ్లాగు పేర్లకు, వాళ్ళ అసలు పేర్లకు, వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ బ్లాగు విధానానికి, వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ ఇంకా చానా చానాలకు ఏ మాత్రం సంబంధం లేదు.

-- ఇదే నా వీర శూర Disclaimer ...


కథ మొదలయ్యింది :

ఓ తెలుగు విద్యార్థి కి తెర చాటు చందమామ లా తెలుగు కోసం తపన పడుతున్న వాళ్ళెందరున్నారో తెలుసుకుందామనే కుతూహలంతో కలిగింది. పదుగురికి ఏదో చెప్పాలనే తపన రోజు రోజుకీ బలీయమయింది. ఇలా ఒంటరిగా ఊహా ప్రపంచం లో మునిగితే సరిపోదు. తనకున్న తెలుగు తీపి ఇంకా ఎంతమందికుందో తెలుసుకోవానే తలపు కలిగడం ఆలస్యం వెళ్ళి తన అంతరంగాన్ని వాళ్ళ నాన్న కి చెప్పాడు.

అది విన్న వాళ్ళ నాన్న చిత్తూరు నాగయ్య లాగా "ఇలా మనసులోని మాట చĺ